క్రికెట్ ప్రపంచకప్, దీపావళిని వీక్షించాలని ఆస్ట్రేలియా ప్రధానికి ప్రధాని మోడీ ఆహ్వానం

సిడ్నీలో అల్బనీస్ తో మోడీ సమావేశం

PM Modi invites Australian counterpart to watch Cricket World Cup, Diwali

సిడ్నీ: దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు భారతదేశానికి రావాలంటూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. బుధవారం అల్బనీస్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇందులో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత అల్బనీస్ ను మోడీ భారత పర్యటనకు ఆహ్వానించారు. ఈ ఏడాది జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను చూసేందుకు రావాలని పిలిచారు.

సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ప్రధాని మోడీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. హౌస్‌లోని సందర్శకుల పుస్తకంపై మోడీ సంతకం చేశారు. కాగా, అంతకుముందు మంగళవారం ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులు, వ్యాపార నేతలతో మోడీ వరుస సమావేశాలు నిర్వహించారు. సాంకేతికతతో పాటు వివిధ రంగాల్లో భారతీయ కంపెనీలతో సహకారం పెంపొందించుకోవాలంటూ వారికి ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.