స్వనిధి లబ్ధిదారులతో ప్రధాని సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి మధ్యప్రదేశ్లోని స్వనిధి పథకం లబ్ధిదారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పాల్గొన్నారు. స్వనిధి (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి) పథకం ద్వారా లబ్ధి పొందిన మధ్య ప్రదేశ్లోని ఇండోర్, గ్వాలియర్, రైసెన్ పట్టణాలకు చెందిన ముగ్గురు వీథి వ్యాపారులతో మోడి మాట్లాడారు. ఈ పథకం క్రింద పొందిన ప్రయోజనాల గురించి వారితో చర్చించారు. వారి వ్యాపారాల కోసం సీడ్ కేపిటల్ సేకరించడంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఉంటే చెప్పాలని అడిగారు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు. లబ్ధిదారుల్లో కొందరితో తాను మాట్లాడానని, వారి మాటల్లో ఆశాభావం, నమ్మకం కనిపించాయని చెప్పారు. ఈ పథకం క్రింద రెండు నెలల్లోనే ఒక లక్ష మందికి పైగా వీథి వ్యాపారులు లబ్ధి పొందారని, ఈ పథకం విజయవంతమవడానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన బృందం ఎంతో కృషి చేశారని అభినందించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/