కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
వారణాసి: కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును సోమవారంనాడు ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.399 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ థామ్ ఫేజ్-1ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. తొలుత ‘హర్ హర్ మహదేవ్’ నినాదంతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పెద్దఎత్తున సాధులు, సంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టు కారిడార్ నిర్మాణంతో వయోవృద్ధులు, దివ్యాంగులు సైతం జెట్టీలు, ఎస్కలేటర్లలో ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడానికి మార్గం సుగమమైందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారు నేరుగా ఘాట్ నుంచి జెట్టీలో ఆలయానికి చేరుకోవచ్చని అన్నారు. ఎస్కలేటర్ ద్వారా కూడా ఘాట్ చేరుకోవచ్చని చెప్పారు. కోవిడ్ మహమ్మారి వెంటాడినా నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అహరహం శ్రమించిన వర్కర్లకు, కారిడార్ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ సర్కార్కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/