కుషినగర్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం బౌద్ధ తీర్థయాత్ర కేంద్రమైన ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ అంతర్జాతీయ విమాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు బుద్ధభగవానుడు మహాపరినిర్వాణ స్థలాన్ని సందర్శించే సౌలభ్యం సుగమమవుతుంది.
ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ విమానయాన రంగాన్ని ఎయిర్ ఇండియా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, సౌకర్యాలు, భద్రతకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఏవియేషన్ రంగం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. మరి కొద్ది వారాల్లో ఢిల్లీ నుంచి కుషీనగర్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు స్పైస్జెట్ తనకు తెలియజేసిందన్నారు. ఇది స్థానిక ప్రయాణికులకు, సందర్శకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. దశాబ్దాల ఆశలు, అంచనాలకు సాకారమే కుషీనగర్ అంతర్జాతీయ విమాశ్రయమని అన్నారు. ఈరోజు తన ఆనందం రెట్టింపయిందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, పౌర విమానయాన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/