వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు రాజస్థాన్లో నాలుగు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. బన్స్వారా, సిరోహి, హనుమాన్ఘర్, దౌసా జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. జైపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ కాలేజీకి కూడా మోడీ శంకుస్థాపన చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ.. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల లేదా ఒక పీజీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలని అన్నారు. ఆరోగ్య సంరక్షణా చర్యలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు.
ఇటీవల ఆయుష్మాన్ భారత్ డిజిటిల్ మిషన్ ఆరోగ్య సేవలను ప్రారంభించామని, ఆ సేవలను దేశమంతా విస్తరించామన్నారు. హాస్పిటళ్లు, ల్యాబ్లు, ఫార్మసీలన్నింటినీ ఒక క్లిక్తో విజిట్ చేయవచ్చు అని తెలిపారు. డిజిటల్ హెల్త్ మిషన్తో రోగుల మెడికల్ డాక్యుమెంట్లు సురక్షితంగా ఉంచవచ్చు అని ప్రధాని తెలిపారు. దేశంలోని ఆరోగ్య రంగాన్ని మార్చేందుకు జాతీయ ఆరోగ్య విధానాన్ని అవలంబిస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు ఆరోగ్య రంగ అవసరాలను గుర్తు చేసిందన్నారు. ప్రతి దేశం ఆ సంక్షోభాన్ని తమదైన రీతిలో ఎదుర్కొన్నట్లు చెప్పారు. మహమ్మారి వేళ భారత తన శక్తిని, ఆత్మరక్షణను పెంచుకుందన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/