మళ్లీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మాక్రాన్‌.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

అధ్యక్ష ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓట్లు ప్రత్యర్థి లీపెన్ ఓటమి

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ మరోసారి ఎన్నికయ్యారు. మాక్రాన్ స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మెరీన్‌ లీ పెన్‌పై మాక్రాన్‌ గెలుపొండం ఇది రెండోసారి. ఆదివారం పెలువడి ఫలితాల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, పెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏళ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్‌ రికార్డు సృష్టించారు.

అయితే ఆయన గెలుపు పట్ల దేశంలోని యువత అంసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి పారిస్‌ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీలు ఝులిపించారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇమ్యాన్యుయెల్‌ వ్యతిరేకంగా సెంట్రల్‌ పారిస్‌లోని చాట్‌లెట్‌ సమీపంలో గుమిగూడిన యువకులను పోలీసులు చెదరగొట్టారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసన తెలిపారు.

కాగా, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరిగి ఎన్నికైనందుకు భారత ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడానికి ఆయనతో కలిసి పనిచేయడం కొసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. “ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు అభినందనలు! భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు కలిసి పనిచేయడం కోసం నేను ఎదురు చూస్తున్నాను” అని మోడీ ట్వీట్ చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/