అట్టహాసంగా వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం

అభినందనలు తెలిపిన మోడి, రాజ్‌నాథ్‌ సింగ్‌

air force day

ఘజియాబాద్‌: భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఢిలీలోని ఘజియాబాద్‌ ‘హిండన్‌ ఎయిర్‌స్టేషన్‌’లో ఈ వేడుకలు జరిగాయి. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక వేడుకల్లో రాఫెల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గాల్లో ఈ విమానాలు చేసిన విన్యాసాలను చూసిన వీక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడి వాయుసేనకు అభినందనలు తెలిపారు. ‘ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా, మన ధైర్యవంతులైన సైనికులకు అభినందనలు. మీరు కేవలం దేశపు గగనాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా, విపత్తుల సమయంలో అపరిమితమైన సేవ చేస్తున్నారు. మీ ధైర్యం, నిబద్ధత, దేశ రక్షణకు చూపుతున్న దీక్ష ప్రతి ఒక్కరికీ ఆదర్శం’ అని ట్వీట్ చేశారు.

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం అభినందనలు తెలుపుతూ, వాయుసేనను చూసి జాతి యావత్తూ గర్విస్తోందని అన్నారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను పైలట్లు ఎదుర్కొంటూ, దేశానికి సేవలందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదూరియా, ఇటీవలే రాఫెల్, అపాచీ ఎయిర్ క్రాఫ్ట్ లు వాయుసేనలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. వీటి బలమేంటో శత్రువులకు తెలుసునని అన్నారు. అధునాత యుద్ధ విమానాల రాకతో వాయుసేన శక్తి పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా యుద్ధ విమానాలు గాల్లో పలు రాకాల ఫార్మేషన్స్ ను ప్రదర్శించాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/