28న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడి

భారత్ బయోటెక్ కు వెళ్లనున్న ప్రధాని

pm modi

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోడి 28న హైదరాబాద్‌కు రానున్నారు. ఈనేపథ్యంలో ఆయన భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని పరిశీలించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 3.45 గంటలకు హైదరాబాద్ హకీంపీట విమానాశ్రయానికి మోడి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ కు చేరుకుని అక్కడ జరుగుతున్న కోవాక్సిన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 5.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయల్దేరుతారు.  కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని మోడి రాక ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి బిజెపి అతిరథ మహారథులంతా తరలిరానున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఈనెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నగరానికి రానున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌ షోలో అమిత్‌ షా పాల్గొంటారు.
శుక్రవారం యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్‌, హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేయనున్నారు. 28న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావుల సభకు హాజరవుతారు. అనంతరం, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్డు షోలో నడ్డా పాల్గొంటారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/