గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు హాజరైన మోడీ, టెడ్రోస్
న్యూఢిల్లీ : గుజరాత్లోని గాంధీ నగర్లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి డబ్ల్యూహెచ్వో అధినేత టెడ్రోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లడుతూ..ఆయుశ్ విభాగంలో పెట్టుబడుల సదస్సు జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలు తమ ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడానికి ఆయుశ్ మందులు కూడా పనిచేశాయని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుతో సంప్రదాయ వైద్యానికి నూతన శకం ఆరంభం కానుందని ప్రకటించారు. రాబోయే 25 ఏళ్లలో ఈ విభాగం ప్రపం చ మానవాళికి మరింత చేరువయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఔషధ మొక్కల పెంపకంలో వున్న రైతులు అత్యంత సులభంగా మార్కెట్తో కనెక్ట్ అవ్వడం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం కూడా ఆయుశ్ విభాగాన్ని ఆధునీకరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్కెట్ స్థలాలను కూడా వెదుకుతోందని ప్రధానిమోడీ వెల్లడించారు.
ఈ సందర్భంగా టెడ్రోస్ గుజరాతీలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందరికీ నమస్కారం.. ఎలా వున్నారు? అంటూ గుజరాతీ భాషలో పలకరించారు. దీంతో సభికులందరూ చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. టెడ్రోస్ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. తనకు ఇండియాకు చెందిన టీచరే చదువు బోధించారని తనతో చెప్పారని మోడీ పేర్కొన్నారు. తాను పక్కా గుజరాతీ అయిపోయానని, తనకు గుజరాతీ పేరును పెట్టాలని తనను కోరారని మోడీ వెల్లడించారు. దీంతో ఆయనకు తులసీ భాయ్ అని నామకరణం చేస్తున్నాని మోడీ సభలో పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/