ఎంజీఆర్ ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు..ప్రధాని
చెన్నై: ప్రధాని నరేంద్రమోడి తమిళనాడులోని డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వర్చువల్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 80 శాతం పీజీ సీట్లను, 50శాతం ఎంబీబీఎస్ సీట్లను పెంచామని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు గత ఆరేళ్లలో 30వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు, 24వేల పీజీ సీట్లు పెంచామన్నారు. దేశంలో కొత్తగా 15 ఎయిమ్స్లకు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. భారతీయ ఆరోగ్య వ్యవస్థను ఇప్పుడు అందరూ కొత్త కళ్లతో, కొత్త గౌరవంతో, కొత్త విశ్వాసంతో చూస్తున్నారని ఆయన అన్నారు. యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు మీపై దృష్టిపెట్టిందని, యువ భుజస్కందాలపై ఆ బాధ్యత ఉందని మోడి అన్నారు. పరీక్షల్లో మార్క్లు సాధించడంతో పాటు.. సమాజంలో పేరు సంపాదించుకునే సంధి కాలంలో మీరున్నారని, కోవిడ్ మహమ్మారి వేళ భారత్ కొత్త పంథాలను వెలుగుచూసిందని, భారత్లో కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉందని, అలాగే రికవరీ రేటు అధికంగా ఉందని ప్రధాని తెలిపారు.
దేశంలో అత్యంత గౌరవనీయమైన వృత్తిలో వైద్యులు ఉన్నారని మోడి అన్నారు. ఈ కరోనా కాలంలో వారి పట్ల గౌరవం మరింత పెరిగిందన్నారు. వైద్య వృత్తి పట్ల అవగాహన పెరగడంతోనే వైద్యులను గౌరవిస్తున్నారన్నారు. ఎవరికైనా ఇది జీవన్మరణ సమస్యలాంటిదేనన్నారు. గంభీరంగా ఉండటం, సమస్యను తీవ్రంగా పరిగణించడం రెండూ వేరని.. ఈ రెండింటి పట్ల అవగాహనతో వ్యవహరించాలన్నారు. రోగులతో మాట్లాడేటప్పుడు సెన్సాఫ్ హ్యూమర్తో వ్యవహరించాలని వైద్యులను ప్రధాని కోరారు. ఆరోగ్య రంగంలో ఈ హాస్పిటల్ వల్ల తమిళ వర్గానికి మేలు జరుగుతుందని, ఎంజీఆర్ ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారని ప్రధాని మోడి అన్నారు. ఎంజీఆర్ పేద ప్రజల పట్ల ఎంతో ఉదారతతో ఉండేవారన్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత వంటి అంశాలను ఆయన పట్టించుకునేవారన్నారు. శ్రీలంకలో ఎంజీఆర్ పుట్టిన గ్రామాన్ని కొన్నేళ్ల క్రితం తాను సందర్శించినట్లు తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/