దీపావళి వరకు గరీబ్‌ కల్యాణ్‌ యోజన పొడిగింపు

80 కోట్ల మందికి ఉచిత రేషన్‌..ప్రధాని మోడి

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈ సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్ డౌన్ తో లక్షల ప్రాణాలు కాపాడగలిగామని, కరోనాతో పోరాడుతూనే ఇప్పుడు అన్ లాక్ 2.0 లో ప్రవేశించామని మోడి వెల్లడించారు. ముఖ్యంగా భారత్ లో 130 కోట్ల మంది ఆరోగ్యంతో కూడిన అంశం కావడంతో నిబంధనలు పాటించడం అత్యావశ్యకం అని అన్నారు. నిబంధనలు పాటించనివారి ఆలోచనా దృక్పథంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వర్షాకాలం రావడంతో అనేక రకాల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జలుబు, జ్వరం చుట్టుముడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు స్వీయ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. మాస్కులు ధరించడం జీవితంలో ఓ భాగం అన్నంతగా పాటించాలని పిలుపునిచ్చారు.

ఓ దేశానికి ప్రధానమంత్రి మాస్కు ధరించలేదని ఆయనకు రూ.13 వేల జరిమానా విధించారని తెలిసిందని వెల్లడించారు. బల్గేరియా ప్రధాని బోయికో బోరిస్సావ్ మాస్కు లేకుండా ఓ చర్చిలో అడుగుపెట్టడంతో ఆయనపై జరిమానా విధించారు. ఈ విషయాన్నే మోడి ప్రస్తావించారు. గ్రామ సర్పంచి అయినా, దేశ ప్రధాని అయినా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు మోడి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్‌ కల్యాణ్‌ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, నెలకు కిలో చొప్పున కందిపప్పును ఉచితంగా అందించనున్నట్లు ప్రధాని మోడి తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/