ఆరోగ్య రంగంలో మన సామర్థ్యం పట్ల ప్రపంచానికి విశ్వాసం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఆరోగ్య రంగానికి బడ్జెట్లో చేపట్టిన చర్యల అమలుపై మంగళవారం ఓ వెబినార్లో మాట్లాడారు. కరోనా అనంతరం ఆరోగ్య రంగంలో మన సామర్థ్యం పట్ల ప్రపంచానికి విశ్వాసం ఇనుమడించిందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్ను మనం అధిగమించాల్సిన అవసరం ఉందని మోడి అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి తరహాలో భవిష్యత్లో పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు.
ప్రస్తుతం ఆరోగ్య రంగానికి అసాధారణంగా బడ్జెట్ కేటాయింపులుండటం ఈ రంగం పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్19 వంటి పలు సవాళ్లను ఎదుర్కొనేలా కరోనా వైరస్ మనకు ఓ గుణపాఠం నేర్పిందని చెప్పారు. వైద్య పరికరాల నుంచి మందుల వరకూ, వెంటిలేటర్ల నుంచి వ్యాక్సిన్ల వరకూ..శాస్త్రీయ పరిశోధనల నుంచి ఆరోగ్య మౌలిక సదుపాయాల వరకూ భారత్ భవిష్యత్లో ఎలాంటి ఆరోగ్య ఎమర్జెన్సీనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/