కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయండి
ప్లాస్మా దానం చేయాలని కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపు
హైదరాబాద్: సైబారాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా బారిన పడి కోలుకున్న బాధితులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వేల మంది కరోనబారిన పడుతున్నారని వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే కరోనా బారిన పడి కోలుకున్న వారు ఇతరుల కోసం స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్మా దానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వారు దానం చేసే 500 మి. లీ ప్లాస్మాతో మరో ఇద్దరు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు. కరోనా వైరస్ రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కరోనా బారిన పడి కోలుకుని ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. అలా ముగ్గురిని కాపాడి వారి కుటుంబాలను ఆదుకున్నామన్నారు. ప్లాస్మా దానం చేసినప్పటికీ 24 గంటలు నుంచి 72 గంటల్లో శరీరంలోకి ప్లాస్మా వచ్చి చేరుతుందని సజ్జనార్ తెలిపారు. ప్లాస్మా ఇవ్వాలనుకునే వారు ఎవరైనా ఫోన్ ద్వారా 9490617440కి సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/