ఎయిర్పోర్టులో ప్రమాదం.. ముక్కలైన విమానం!
ఇస్లాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పిన విమానం రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లి పడిపోయింది. అనంతరం మూడు ముక్కలుగా విమానం విడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇస్తాంబుల్లోని సబీహా గోకెన్ ఎయిర్పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానం పెగాసస్ ఎయిర్లైన్స్కి చెందినదని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. విమానం కిందపడిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని ఎయిర్పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారని చెప్పారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అభిప్రాయపడ్డారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు అధికారులు. విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/