గాల్వన్ ఘర్షణలో చైనా నష్టాలకు మొదటి సాక్ష్యం
వైరలవుతోన్న చైనా సైనికుడి సమాధి ఫోటో
బీజింగ్: గాల్వాన్లో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనాకు ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ చైనా గోప్యంగానే ఉంచింది. ఈ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు? ఎంత మంది గాయపడ్డారు? అనే వివరాలను చైనా కమ్యూనిష్టు ప్రభుత్వం ఇప్పటికీ దేశ ప్రజలకు తెలియజేయలేదు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ సమాధి రాయి ఫోటో ఇంటర్నెట్లో వైరలవుతుంది. చైనా సైనికులు మరణించారు అనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజనులు. చైనీస్ ఇంటర్నెట్ వీబో అకౌంట్లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమయ్యింది. క్షణాల వ్యవధిలోనే ఆ ఫోటో మన దేశంలోని చాలా ట్విట్టర్ యూజర్ల అకౌంట్లలో ప్రత్యక్షమయ్యింది.
ఈ సమాధి రాయి చైనా సైనికుడు చెన్ జియాంగ్రాంగ్కు చెందినదిగా తెలుస్తోంది. సమాధి రాయిపై మాండరిన్ భాషలో ఖ69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచిగ అని రాసి ఉంది. అంతేకాక ఖచెన్ జియాంగ్రో సమాధి. జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుందిగ అని తెలుపుతుంది. 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో చూపిస్తోంది. మరణించిన సైనికుడు 19 సంవత్సరాల వయస్సు వాడని.. అతడు 2001 డిసెంబర్లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. అయితే దీనిపై ఇంకా చైనా అధికార యంత్రాంగం స్పందించలేదు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/