పెరూలో మరో 90 రోజులు నిషేధాజ్ఞలు
లిమా: పెరూలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. పెరూలో ఇప్పటివరకు 6,21,997 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28,277 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అమల్లో ఉన్న అత్యయిక స్థితిని మరో 90 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. జూలైలో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల తీరును పరిశీలిస్తే అన్ని ప్రాంతంలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తేలిందని, మెట్రోపాలిటన్ నగరాలైన లిమా, కల్లావోల్లోనూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, అందుకే ఎమర్జెన్సీని పొడిగించాల్సి వచ్చిందని పెరూ ప్రభుత్వం పేర్కొన్నది. ఎమర్జెన్సీ అమలులో ఉన్నన్ని రోజులు పబ్లిక్ ప్రాంతాల్లోనే కాకుండా జనావాసాల్లోనూ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పెరూ ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. అంటే ప్రజలు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడంపై కూడా నిషేధం ఉంటుందని స్పష్టంచేసింది. నిబంధనలు ధిక్కరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/