మూత్ర విసర్జన వివాదం..ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా

నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీజీసీఏ చర్యలు

Air India
Air India

న్యూఢిల్లీః విమానంలో మహిళపై మూత్ర విసర్జన వివాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిరిండియాపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) చర్యలు తీసుకుంది. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఘటనను అధికారికంగా తెలియజేయని విమాన పైలట్‌ ఇన్ కమాండ్‌ లైసెన్స్‌ను మూడు నెలలపాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తన డ్యూటీ సక్రమంగా చేయడంలో విఫలమైన ఎయిరిండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్‌కు కూడా రూ.3 లక్షల జరిమానా విధిస్తున్నట్టు వెల్లడించింది.

న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో డెబ్బై ఏళ్ల మహిళపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది. బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో న్యాయం కోసం ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు ఆమె లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శంకర్ మిశ్రా విమాన ప్రయాణాలు చేయకుండా నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. అంతకుముందే విధించిన 30 రోజుల నిషేధానికి ఇది అదనం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/