నిర్లక్ష్యంగా కారు నడిపిన పేటీఎం సిఇఓ
అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు , వెంటనే బెయిల్ మంజూరు
పేటీఎం సిఇఓ విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరిలో అరెస్టు చేసిన వైనం విదితమే . అయితే ఆ తర్వాత వెంటనే ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. గత నెల 22న జరిగిన ఈ ఘటన పై ఇపుడు పూర్తి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విజయ్ శేఖర్ నిర్లక్ష్యంగా కారు నడిపి మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో శర్మను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ పోలీసుల కధనం ప్రకారం.. ఫిబ్రవరి 22న మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ల్యాండ్ రోవర్ కారులో ప్రయాణిస్తున్న విజయ్ శేఖర్ శర్మ , వేగంగా వచ్చి డీసీపీ బెనితా మేరీ జైకర్కు చెందిన కారును ఢీకొట్టారు. విజయ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఎఫ్ఐఆర్లో తెలిపారు.
ఆ సమయంలో డీసీపీ కారును పెట్రోల్ కొట్టించడానికి తీసుకెళ్తున్న డ్రైవర్ దీపక్ కుమార్.. విజయ్ కారు నెంబర్ను , ఈ విషయాన్ని డీసీపీకి తెలిపారు. దీంతో డీసీపీ ఆ కారు నెంబర్ ద్వారా విచారణ జరపాలని సిబ్బందిని ఆదేశించగా, ఆ కారు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు సంబంధించిన కారు అని తేలింది. వెంటనే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో.. ఆయన్ను అదుపులోకి తీసుకున్న కాసేపటికే వదిలేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/