ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే చేయాలా?
అమరావతి ఉద్యమాన్ని ఓ సామాజిక వర్గానికి ముడిపెట్టడం ఏంటీ?..పవన్
అమరావతి: వైఎస్ఆర్సిపి నేతలు అమరావతి ఉద్యమకారులపై చేసిన వ్యాఖ్యలు సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆయనతో అమరావతి పరిరక్షణ సమితి నేతలు మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వైఎస్ఆర్సిపి నేతల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, బంగారం నగలు ధరించి ఉద్యమం చేయకూడదా? అని ఆయన నిలదీశారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే చేయాలా? అని ప్రశ్నించారు. అలాగే, ఉద్యమాన్ని ఓ సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని ఆయన విమర్శించారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు. ఏపి రాజధానిగా అమరావతి ఉంటుందని తనకు బిజెపి స్పష్టం చేసిందని పవన్ చెప్పారు. అలాగే రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్పలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తే తమ పార్టీ కార్యాచరణ వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/