గన్నవరం ఎయిర్పోర్టు చేరుకున్న పవన్
కాసేపట్లో మంగళగిరిలో పార్టీ నేతలతో భేటీ
అమరావతి : ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటించాలని నిర్ణయం తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది. గన్నవరం ఎయిర్పోర్టుకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టు వద్దకు అభిమానులు భారీగా చేరుకోవడం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కు అనుకూలంగా అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
కాగా, కాసేపట్లో పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడం, వైసీపీ ప్రభుత్వంపై పోరాడడంవంటి అంశాలపై తమ నేతలకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, అక్టోబరు 2న పవన్ ఏపీలోని పలు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు శరవేంగా రోడ్ల మరమ్మతు పనులు మొదలు పెట్టారు. దీంతో పవన్ రాకతో అయినా తమ ప్రాంతంలో రోడ్లు బాగుపడుతున్నాయంటూ ఆ ప్రాంతాల ప్రజలు మీడియా ముందు హర్షం వ్యక్తం చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/