అసని ఎఫెక్ట్ : ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచన

అసని తూఫాన్ ఎఫెక్ట్ ఏపీ ఫై ఎక్కువగా ఉండడం తో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద ఈ తూఫాన్ ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. అలాగే ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలని కోరారు. 17శాతం మించి తేమ ఉండకూడదనే నిబంధన ఈ సమయంలో వర్తింపజేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలని కోరారు. అలాగే తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారని , ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలని కోరారు. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

ఇక అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.