రైలు ప్రమాదంలో 278 మంది ప్రయాణికులు మృత్యువాతపడటం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి

pawan-kalyan

అమరావతిః ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘోరం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. 278 మంది ప్రయాణికులు మృత్యువాతపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని తెలిపారు.

ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోందని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బాధిత ప్రయాణికులు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాదాల నివారణ కోసం భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.