జర్నలిస్టుల అరెస్ట్ లు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం – పవన్ కళ్యాణ్

సీనియర్ జర్నలిస్టు అంకబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

గురువారం (సెప్టెంబర్ 21) రాత్రి 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును విజయవాడలోని ఆయన నివాసంలోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ లో ఓ మెసేజ్ ఫార్వడ్ చేసినందుకు అంకబాబును అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దినపత్రికల్లో జర్నలిస్టుగా సుదీర్ఖకాలం పనిచేసిన అంకబాబును ఆయన నివాసంలోనే బలవంతంగా అరెస్ట్ చేసి, ఆయన భార్యకు నోటీసులు జారీ చేశారు. అంకబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయనను వెంటనే విడుదల చేయాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

అంకబాబు అరెస్ట్ ఫై పవన్ కళ్యాణ్ స్పందించారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని అంకబాబు తమ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే తప్పేముందని ప్రశ్నించిన పవన్… ఈ ఘటనపై ప్రభుత్వం ఇంతగా రియాక్ట్ అయ్యిందంటే.. అందులో ఏదో మతలబు దాగుందని అన్నారు. అసలు అంకబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనే లేదని కూడా పవన్ ఆరోపించారు.

సింగిల్ పోస్టును షేర్ చేస్తేనే అంకబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. నేతలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన కామెంట్లు పోస్ట్ చేస్తున్న వైస్సార్సీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పవన్ ప్రశ్నించారు. హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచేలా పోస్టులు పెట్టిన కేసును సీఐడీ అధికారులు ఏ రీతిన దర్యాప్తు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటికీ ఇంకా కొందరిని అరెస్టే చేయలేదని కూడా పవన్ గుర్తు చేశారు.

అంకబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతోపాటు వాక్‌ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అంకబాబుకు ఏమైనా జరిగితే పోలీసుశాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెంటనే అంకబాబును విడుదల చేయాలని డిజిపి కి లేఖ రాసారు.