మోడీతో భేటీ అనంతరం ఏపీకి మంచి రోజులు వస్తాయంటూ పవన్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..విశాఖ పర్యటన కు వచ్చిన ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. దాదాపు వీరిద్దరూ అరగంట సేపు సమావేశమయ్యారు. ప్రధాని బస చేసిన ఐఎన్‌ఎస్ చోళ హోటల్‌లో పవన్ కళ్యాణ్ – మోడీ భేటీ అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హోటల్ వెలువల మీడియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏపీకి త్వరలో మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు.

‘రెండు రోజుల కిందట నాకు పీఎంవో నుంచి పిలుపు వచ్చింది. అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా ప్రధానిని కలవలేదు. 2014లో ప్రమాణ స్వీకారానికి ముందు ఆయణ్ని కలిశాను. ఆ తర్వాత ప్రధానిని ఎప్పుడూ కలవలేదు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే కలవడం. ప్రత్యేక పరిస్థితుల్లో కలిసిన మీటింగ్ ఇది. మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. ప్రధాని ఆకాంక్ష కూడా ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలి. తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను మోడీ అడిగి తెలుసుకున్నారని పవన్ తెలిపారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు తెలియజేశానని చెప్పారు. ‘భవిష్యత్తులో ఇది ఏపీకి మంచి రోజులు తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అంటూ పవన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇంతకీ మోడీ, పవన్ తో ఏం మాట్లాడారు.? అడిగిన రూట్ మ్యాప్‌ మోదీ ఇచ్చారా.? లోకల్‌ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్‌ లేవనెత్తారు. ఇవే సమస్యలు ఇప్పుడు మోడీ ముందు కూడా ఉంచారా?. టీడీపీకి పవన్‌ దగ్గర అవుతున్న క్రమంలో మోడీ ఏం మాట్లాడారు? షెడ్యూల్‌ టైమ్‌కి మించి ఇద్దరి మధ్య జరిగిన చర్చపై ఉత్కంఠ రేపుతోంది. పవన్‌ తో చర్చలు ముగిసిన తర్వాత బీజేపీ నేతలతో భేటీ అయిన మోదీ, పవన్ లేవనెత్తిన సమస్యలను తెలుసుకున్నట్లు సమాచారం.

అంతకు ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధానికి..సీఎం జగన్ , గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ స్వాగతం పలికారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. ప్రధాని మోడీ విశాఖపట్నం చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగా ల్యాండయిన మోడీ.. అక్కడినుంచి మారుతి జంక్షన్ వరకు రోడ్ మార్గంలో వెళ్లారు. విశాఖ వాసులకు కారునుంచి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. అనంతరం ఐఎన్ఎస్ చోళాకు చేరుకున్న మోడీ.. జనసేన అధినేత పవన్‌తో భేటీ అయ్యారు.