పేర్ని నాని..ఓ బ్లాక్ టిక్కెట్ల మంత్రి – పట్టాభి సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి మరోసారి వైసీపీ పార్టీ ఫై , మంత్రి పేర్ని నాని ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి పేర్నినాని బ్లాక్ టిక్కెట్ మంత్రి అని.. బెంజ్,బెట్టింగ్ మంత్రులతో పాటు ఇప్పుడు బ్లాక్ టిక్కెట్ మంత్రి వచ్చాడని ఫైర్ అయ్యారు. పేర్నినానికి బైపాస్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి తేడా తెలియదని చురకలు అంటించారు. విషయ పరిజ్ఞానం లేకుండా తాడేపల్లి ప్యాలెస్ లో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలా…? అని ప్రశ్నించారు.

అమరావతి రాజధాని, దాని చుట్టూ వున్న విజయవాడ,గుంటూరును కలుపుతూ 189కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు రూపకల్పన జరిగిందని.. 17761కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఆమోదించిందని వెల్లడించారు. అటువంటి ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు పట్టాభి.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేసింది చంద్రబాబా…?. రాజశేఖర్ రెడ్డా…!?. వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దన్నారు. ఓ.ఆర్.ఆర్.ను రియల్ ఎస్టేట్ కోసం అష్టవంకర్లు తిప్పిన ఘనత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును చెత్త బుట్టలో పడేసిందని పేర్ని నానీ నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.