షెడ్యూల్ కంటే ముందే ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23న ముగిసే అవకాశం..

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న ప్రారంభమైన పార్లమెంట్ వింటర్ సెషన్ ఈ నెల 29 వరకు కొనసాగాల్సి ఉండగా.. ఆరు రోజులు ముందుగానే అంటే ఈ నెల 23న ముగియనుంది. డిసెంబర్ 23న పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడనున్నాయి. లోక్సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. లోక్సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.