పీవీ సింధుకు పార్ల‌మెంట్‌ అభినంద‌న‌లు

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు పదో రోజు ప్రారంభం అయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ)కు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో సింధు అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించిందని, వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌లో మెడ‌ల్స్ సాధించిన తొలి భార‌తీయ మ‌హిళా క్రీడాకారిణిగా ఆమె చ‌రిత్ర సృష్టించిన‌ట్లు వెంక‌య్య తెలిపారు.

లోక్‌స‌భ కూడా సింధుకు కంగ్రాట్స్ చెప్పింది. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. బ్యాడ్మింట‌న్ మ‌హిళ సింగిల్స్‌లో హైద‌రాబాద్ క్రీడాకారిణి సింధు బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన‌ట్లు చెప్పారు. వ్య‌క్తిగ‌త ఈవెంట్‌లో రెండు మెడ‌ల్స్ వ‌రుస‌గా గెలుచుకున్న భార‌తీయ మ‌హిళా క్రీడాకారిణి ఆమె అని స్పీక‌ర్ తెలిపారు. ఆమె సాధించిన విజ‌యాలు ఈ దేశ యువ‌త‌కు ప్రేర‌ణ‌కు నిలుస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు ఓం బిర్లా వెల్ల‌డించారు.

కాగా, సింధుకు కంగ్రాట్స్ చెప్పిన త‌ర్వాత రాజ్య‌స‌భ‌లో నినాదాలు మొద‌ల‌య్యాయి. విప‌క్ష స‌భ్యులు వాయిదా తీర్మానాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌న్నారు. దీంతో చైర్మ‌న్ వెంక‌య్య స‌భ‌ను 12 గంట‌ల‌కు వాయిదా వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/