పాక్ పడవలో 280 కోట్ల విలువైన హెరాయిన్ ను పట్టుకున్న భారత అధికారులు

స్మగ్లర్లను కచ్ జిల్లాలోని జాఖౌ తీరానికి తరలించిన అధికారులు


న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. తాజాగా గుజరాత్ సముద్ర తీరంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నాయి. నిన్న రాత్రి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలతో భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోటును గుజరాత్ తీరంలో పట్టుకున్నారు.

అరేబియా సముద్రం మీదుగా హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతోందంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టారు. ఇండియా వైపు వస్తున్న పాకిస్థాన్ పడవ ‘అల్ హజ్’ ను అడ్డుకున్న అధికారులు అందులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షిప్ లో పెద్ద ఎత్తున హెరాయిన్ ను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకున్న అధికారులు, షిప్ లో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం కచ్ జిల్లాలోని జాఖౌ తీరానికి తరలించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/