ఇమ్రాన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆర్మీ అసహనం

దొంగలు, దోపిడీదారుల చేతిలో పాక్ అణ్వాయుధాలు ఉన్నాయన్న ఇమ్రాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో ప్రభుత్వం మారినప్పటికీ రాజకీయ ప్రకంపనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పై తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్ షెహబాజ్ వంటి వ్యక్తి చేతిలో ఉండటం ప్రమాదకరమని ఇమ్రాన్ అన్నారు. దొంగలు, దోపిడీదారుల చేతిలో పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉన్నాయని… ఇది దేశ రక్షణకు సంబంధించి ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. కుట్ర ద్వారా అధికారంలోకి వచ్చిన వ్యక్తి దేశాన్ని కాపాడతారా? అని దేశ ప్రజలను అడుగుతున్నానని అన్నారు. పెషావర్ లో ఓ రోడ్ షో సందర్భంగా ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆర్మీ అసహనం వ్యక్తం చేసింది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ మాట్లాడుతూ, ఇమ్రాన్ ఆరోపణలను పాక్ ఆర్మీ ఖండిస్తోందని అన్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాలు కేవలం ఒక వ్యక్తి అధీనంలో ఉండవని ఆయన చెప్పారు. పాక్ అణ్వాయుధాలకు ఎలాంటి ముప్పు లేదని, రాజకీయ చర్చల్లోకి వీటిని లాగవద్దని సూచించారు. పాకిస్థాన్ కమాండ్, కంట్రోల్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ప్రపంచంలో ఉన్న అత్యున్నత వ్యవస్థల్లో ఒకటని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/