435 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌

200 పడకలతో ఖైదీల కోసం జైలులో ప్రత్యేక కొవిడ్ కేంద్రం

jail

గువాహటి: అసోం గువాహటిలోని కేంద్ర కారాగారంలో 435 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఇది జైలులోని మొత్తం ఖైదీల సంఖ్యలో 44 శాతం కావడం గమనార్హం. రాష్ట్రంలోని 10 జైళ్లలో 535 మంది ఖైదీలకు, గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు వైరస్ సంక్రమించినట్టు అసోం జైళ్ల శాఖ డీజీ దశరథదాస్ తెలిపారు. గువాహటి జైలులో 200 పడకలతో ఖైదీల కోసం కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే, లక్షణాలు లేని ఖైదీలను నాగాం ప్రత్యేక జైలులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఖైదీలందరికీ పరీక్షలు చేసినట్టు వివరించారు.

గువాహటి కేంద్ర కారాగారంతోపాటు నల్బరి, ధూబ్రీ, కరీంగంజ్, నార్త్ లఖింపూర్, గోలఘాట్, డిఫూ, ఉడాల్ గురి జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని, దీంతో 376 మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తొలుత అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. కాగా, గువాహటి జైలులో ఉన్న రైతు నాయకుడు అఖిల్ గొగోయ్‌, యాక్టివిస్టు షర్జిల్ ఇమామ్‌లు కూడా కరోనా బారినపడడంతో వారితోపాటు కరోనా సోకిన ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలని గౌహతి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/