టిఆర్ఎస్ ఎంపీ కేశవరావుపై ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు
మున్సిపల్ ఎన్నికల్లో టిర్ఆఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది
న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు టీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు నడుచుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నిబంధనలకు విరుద్ధంగా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేశారని చెప్పారు. సాంకేతికంగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదని లక్ష్మణ్ అన్నారు. ఈమేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్టు లక్ష్మణ్ తెలిపారు. ఉప రాష్ట్రపతిని కలిసినవారిలో ఎంపీలు బండి సంజయ్, అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు,ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.
తాజా ఎపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/