జపాన్‌ నౌకలో మరో భారతీయుడికి కోవిడ్‌-19

Diamond Princess cruise ship
Diamond Princess cruise ship

జపాన్‌: జపాన్ సముద్ర జలాల్లో ఉన్న డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో ఉన్న భారతీయులలో మరొకరికి కోవిడ్‌-19 వైరస్ సోకింది. దీంతో కరోనా బారిన పడిన భారతీయుల సంఖ్య ఎనిమిది మందికి పెరిగినట్టు జపాన్ అధికారులు ప్రకటించారు. మొత్తంగా షిప్ లో కొత్తగా 79 మందికి కోవిడ్‌-19 వైరస్ సోకినట్టు చెప్పారు. కోవిడ్‌-19 సోకిన భారతీయులను సముద్ర తీరంలో ఉన్న క్వారంటైన్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తున్నామని, వారు కోలుకుంటున్నారని తెలిపారు. కాగా షిప్ లో మొత్తంగా ప్రయాణికులు సిబ్బంది కలిపి 3,711 మంది ఉండగా.. అందులో భారతీయులు 138 మంది ఉన్నారు. అయితే ఈ షిప్ లో ప్రయాణించి వైరస్ బారినపడినవారిలో గురువారం ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆ ఇద్దరూ 70 ఏళ్ల వయసు పైబడినవారని, వారి పది రోజుల కిందే తీరంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడం మొదలుపెట్టామని చెప్పారు. పెద్ద వయసు వారు కావడంతో వైరస్ సోకడం వల్ల తలెత్తిన లక్షణాలను తట్టుకోలేకపోయారని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/