మరోసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పి బిజెపి లో చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ పొంగులేటి వ్యవహారం కొనసాగుతుంది. బిఆర్ఎస్ పార్టీ కార్య కలాపాలకు దూరం గా ఉంటూ వస్తున్నాడు. అంతే కాకుండా ఆత్మీయ సమ్మేళనం పేరుతో కొద్దీ రోజులుగా తన అభిమానులను , కార్య కర్తలను కలుస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఈరోజు ఇల్లందులోని నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేసారు. నాలుగున్నర సంవత్సరాలుగా తనకు తీవ్ర ఆవేదన ఉందని తన బాధను మరోసారి వెలిబుచ్చారు. 2013 ఫిబ్రవరి 13 న రాజకీయ రంగ ప్రవేశం చేసి.. ముగ్గురు శాసనసభ్యులతో పాటు పార్లమెంటును గెలిపించానని తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా మెజారిటీ స్థానాలు గెలిపించుకున్నానని చెప్పుకొచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఆహ్వానం మేరకు వెళ్లినట్టు తెలిపారు. కానీ.. టీఆర్ఎస్‌లో తనతో పాటు తన ఫాలోవర్స్‌లో ఒక్కరికి కూడా పదవులు ఇప్పించుకోలేకపోయానని బాధపడ్డారు. 2018 ఎన్నికల్లో కూడా తన ఫాలోవర్స్‌కు టికెట్ దక్కలేదన్నారు. 2019 ఎన్నికల్లో కూడా.. ఒక పార్టీకి రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. పదవులు ఇవ్వక పోయినా.. కేసీఆర్ మాటలకు విలువ ఇచ్చి పార్టీలో కొనసాగినట్టు చెప్పుకొచ్చారు.

“ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గెలిపించి పార్లమెంటుకు పంపుతామని అభిమానులు ఒత్తిడి తెచ్చినా కానీ.. నేను పార్టీ లైన్ దాటలేదు. ఏ వ్యక్తికైనా ఆత్మ గౌరవం ఉంటుంది. నాకూ ఆత్మాభిమానం ఉంది. జిల్లా ప్రజల శుభా-అశుభ కార్యక్రమాల్లో పాల్గొని తోచిన సాయం చేశాను. పోడు భూముల సమస్యను పరిష్కారం చేస్తానని కేసీఆర్ మాట తప్పారు. గడిచిన 4 ఏళ్లుగా ప్రజల గుండెల్లో ఉండాలని భావిస్తూ పర్యటిస్తూ వచ్చాను. వైఎస్సార్, ఎన్టీఆర్ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారు. నా ప్రతి కార్యక్రమాన్ని అనేక రకాలుగా అడ్డుకుంటున్నారు. అనేక కేసులు పెట్టినా నా అభిమానులు ఓర్చుకున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం రానున్న కాలంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను” అంటూ పొంగులేటి చెప్పుకొచ్చారు.