కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల గడువు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124ఏ యథేచ్ఛగా దుర్వినియోగమవుతోందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల గడువు ఇచ్చింది. ఈ వివాదాస్పద సెక్షన్‌ను సమీక్షించాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం నమోదైన రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోందా? లేదా? తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ 124ఏపై సమీక్ష పూర్తయ్యే వరకు ప్రస్తుతం విచారణలో ఉన్న రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించాలని భావిస్తోందా? లేదా? బుధవారం నాటికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించేంత వరకు విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించేందుకు ఎంత కాలం పడుతుందని, దీని దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని పునఃసమీక్షిస్తున్నామని చెప్తూ, ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణను కొనసాగించవద్దని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే. పునఃపరిశీలన జరుగుతోందని మెహతా చెప్పినపుడు సుప్రీంకోర్టు స్పందిస్తూ, రాజద్రోహం చట్టం దుర్వినియోగమవుతోందని ఆందోళన ఉందని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 124ఏపై పునఃపరిశీలన ప్రక్రియను మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయాలని, అప్పటి వరకు ఈ సెక్షన్ ప్రకారం దాఖలైన కేసుల్లో తదుపరి చర్యలను చేపట్టకుండా తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని సలహా ఇచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/