సిరిసిల్లలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణ

సిరిసిల్ల : తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు విజృభిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 40పైకి కేసులు నమోదైయ్యాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దుబాయి నుంచి ఇటీవల వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ గుర్తించారు. తాజాగా బాధితుడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్ వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో తేలింది. ముగ్గురిని చికిత్స కోసం టిమ్స్‌కు తరలించారు. కొత్త కేసులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 4కు చేరింది.

మరోవైపు ఖమ్మం జిల్లాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. కరోనా లక్షణాలతో ఈనెల 20న ఓ యువతి ఖమ్మంలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. యువతి నుంచి సేకరించిన నమూనాను జీనోమ్‌ సీక్వెన్స్‌ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్య అధికారులు ఆమె కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. అయితే, యువతి కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/