రోగనిరోధకశక్తిని ఒమిక్రాన్ ఏమారుస్తుంది: సింగపూర్ నిపుణులు

టీకాలు, బూస్టర్ డోసుల ద్వారా ఒమిక్రాన్ అంతం కష్టం

సింగపూర్ : గుబులు పుట్టిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌కు రోగ నిరోధకశక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉందని సింగపూర్ నిపుణులు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఈ వేరియంట్ అత్యంత తీవ్రమైన సార్స్‌కోవ్-2 స్ట్రెయిన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో కేసులు పెరగడంతోపాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతుందని సాస్వీ హాక్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ నటాషా హొవార్డ్ తెలిపారు. అయితే, ఒమిక్రాన్ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదన్నారు.

టీకాలు వేసుకోవడం, బూస్టర్ డోసులు తీసుకోవడం ద్వారా మాత్రమే ఒమిక్రాన్‌ను అంతం చేయలేమని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కారణంగా రీఇన్ఫెక్షన్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైనట్టు చెప్పారు. సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ అసోసియేట్ డైరెక్టర్ లిమ్ వీ కియట్ మాట్లాడుతూ.. కరోనా ఎప్పుడు అంతమవుతుందని అంచనా వేయడం వ్యర్థ ప్రయాస అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు, చికిత్సా విధానాలతో ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయాలనుకోవడం అనుకున్నంత సులభం కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

టీకాల తయారీతోపాటు చికిత్సా విధానంలోనూ మార్పులు జరిగితే తప్ప అది సాధ్యం కాదని అధ్యయనం పేర్కొంది. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా టీకాలను పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్‌లో ప్రమాదకర సంఖ్యలో ఉత్పరివర్తనాలు జరగడంతో దానిపై బూస్టర్ డోసు ప్రభావం అంతంత మాత్రమేనని అధ్యయనకారులు తేల్చి చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌తో కలిసి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం చేసిన ఈ అధ్యయన వివరాలను ‘నేచర్ జర్నల్’ ప్రచురించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/