టీకాలకు, ఆంక్షలకు ఒమిక్రాన్ ఆగదు..అమెరికా వైద్యుడు

ఫిబ్రవరి నాటికి భారత్ లో గరిష్ఠాలకు కేసులు..అమెరికా వైద్యుడి అంచనాలు

న్యూయార్క్ : కరోనా ఒమిక్రాన్ వైరస్ ఆంక్షలతో ఆగిపోయేది కాదని.. రెండు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది దీని బారిన పడొచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు, ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే అభిప్రాయపడ్డారు. డెల్టా సమయంలో చూసిన మాదిరిగానే ఒమిక్రాన్ లోనూ పెద్ద సంఖ్యలో కేసులు భారత్ లో వస్తాయని క్రిస్టోఫర్ అంచనా వేస్తున్నారు.

‘‘టీకాలు తీసుకున్న వారిలో లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉంటాయి. కానీ, ఒమిక్రాన్ ఎక్కువ మంది జనాభాకు పాకిపోతుంది. ఎటువంటి ఆంక్షలు దీన్ని నియంత్రించలేవు’’ అని పేర్కొన్నారు. జనవరిలోనే ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఒమిక్రాన్ బారిన పడొచ్చని క్రిస్టోఫర్ అంచనా వేస్తున్నారు. డెల్టా గరిష్ఠ స్థాయిలో ఉన్న 2021 ఏప్రిల్ లోని గణాంకాలతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ అవుతుంది. భారత్ లో జనవరి చివరికి, లేదా ఫిబ్రవరిలో ఇన్ఫెక్షన్ కేసులు తారస్థాయికి చేరుకునే అవకాశం ఉందని క్రిస్టోఫర్ చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/