తెలంగాణలో 2 ఒమిక్రాన్ కేసులు గుర్తింపు
హైదరాబాద్ : తెలంగాణలో ఇద్దరు ఒమిక్రాన్ కేసుల బాధితులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు. ఒమిక్రాన్పై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని గడల శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటన చేశారు.
హైదరాబాద్లోని టోలీచౌకిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల యువతి ఈ నెల 12న రాష్ట్రానికి వచ్చిందని, ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిందని ఆయన వివరించారు. బాధితులను టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నాం అన్నారు. ఒమిక్రాన్కు సంబంధించిన పూర్తి సమాచారం నిపుణుల వద్ద కూడా లేదని ఆయన చెప్పారు. ఇప్పుడే అది వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. మరో వ్యక్తికి ఎయిర్పోర్టులో పాజిటివ్ గా తేలిందని, ఆ వ్యక్తి పశ్చిమ బెంగాల్కు చెందని వ్యక్తి అని రాష్ట్రంలోకి రాలేదని గడల వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/