క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది
ఒడిశాకు చెందిన రాజశ్రీ స్వెయిన్ అనే మహిళా క్రికెటర్ అనుమానస్పద రీతిలో కన్నుమూయడం క్రీడా రంగంలో విషాదం విషాదం నింపింది. రాజశ్రీ స్వైన్ అనే మహిళ క్రికెటర్ కనిపించలేదని ఆమె కోచ్ బుధవారం మంగళబాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె కోసం వెతకగా, శుక్రవారం ఉదయం ఆతాగడ్ అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు హత్యగా భావించి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె మరణానికి కారణం ఏంటనేది తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. అయితే.. తమ కూతురును ఎవరో హత్య చేశారని రాజశ్రీ కుటుంబసభ్యులు ఆరోపించారు. రాజశ్రీ మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉండడం.. ఆమె కళ్లు కూడా దెబ్బతిన్నట్లు ఉండడం, ఘటనా స్థలానికి కొంత దూరంలో రాజశ్రీ స్కూటీ కనిపించడం తో ఎవరో కావాలనే ఆమెను హత్య చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.
త్వరలోనే పుదుచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి టోర్నమెంట్ కోసం ఒడిశా క్రికెట్ సంఘం (ఓసీఏ) బజ్రకబటి ప్రాంతంలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించింది. రాజశ్రీతో పాటు 25 మంది ఎంపికయ్యారు. వాళ్లంతా అక్కడే ఒక హోటల్లో ఉంటున్నారు’ అని రాజశ్రీ కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.