ఒడిశా రైలు ప్రమాదం..43 రైళ్లు రద్దు
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 280 మందికి పైగా మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కూడా ఉన్నారు. ఘటనా స్థాలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఒడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రైలు బోగీల్లో చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులను దవాఖానలకు తరలించేందుకు 200 అంబులెన్సులను ఒడిశా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
మరోవైపు పట్టాలపై రైలు బోగీలు పడిఉండటంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. బాలేశ్వర్ మీదుగా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 43 రైళ్లను అధికారులు తాత్కాలికంగా కాన్సల్ చేశారు. మరో 38 రైళ్లను ఇతర ప్రాంతాల మీదుగా నడుపుతున్నారు. రైలు ప్రమాదంపై వివరాలు అందించేందుకు రైల్వే శాఖ అధికారులు పలు హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. అవి..సికింద్రాబాద్ రైల్ నిలయం (040 27788516), విజయవాడ రైల్వే స్టేషన్ (0866 2576924), రాజమండ్రి రైల్వే స్టేషన్ (0883 2420541), రేణిగుంట రైల్వే స్టేషన్ (9949198414), తిరుపతి రైల్వే స్టేషన్ (781595571), విజయనగరం హెల్ప్లైన్ (08922 221202, 221206), ఒడిశా ప్రభుత్వం ఏర్పాటుచేసిన నంబర్ 06782-26228 సహాయ కేంద్రాలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే వర్గాలు వెల్లడించాయి.