బీఆర్ఎస్ బలం నానాటికీ తగ్గుతోందని..ఖమ్మంలో కేసీఆర్ సభ -ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

రాష్ట్రంలో బీఆర్ఎస్ బలం నానాటికీ తగ్గుతోందని అందుకే ఖమ్మంలో కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఖమ్మం సభలో రైతులకు దిక్సూచిని చూపిస్తానని కేసీఆర్ చెపుతున్నారని… అదే ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. పాసు పుస్తకాలు బ్యాంకుల్లో తనఖాల్లో ఉండటాన్ని రైతులు అవమానంగా భావిస్తున్నారని, రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ప్రభాకర్ డిమాండ్ చేసారు. కేసీఆర్ ను కాంగ్రెస్ కాపాడుతోందని దుయ్యబట్టారు. అందుకే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు.

కమ్యూనిస్టులు కూడా కేసీఆర్ కు అనుకూలంగా మారిపోయారని అన్నారు. కమ్యూనిస్టుల కోరిక మేరకే కేసీఆర్ ఖమ్మంలో సభ పెడుతున్నారని తెలిపారు. తన కొడుక్కి పోటీ అవుతాడేమో అనే యోచనతో హరీశ్ రావును ఢిల్లీకి పంపించేందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాజ్యాంగబద్ధంగా ఏపీ కేడర్ కు చెందిన అధికారి అని… అయితే ఆయన పట్ల ఉన్న ప్రేమతో ఆయనను కేసీఆర్ తెలంగాణలో ఉంచుకున్నారని విమర్శించారు.