టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా

ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు ఫ్యామిలీ ఫై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఎన్టీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ స్పందనను తెలుగుదేశం నేతలు తప్పు పట్టారు. ఎన్టీఆర్ ఫై పలు ఆరోపణలు చేసారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఫై చేసిన వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన బాట పట్టారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఏకంగా చంద్రబాబు కంచుకోట కుప్పంలోనే ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. మరోసారి తమ హీరోను విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ టీడీపీ నేతలను గట్టిగానే హెచ్చరించారు. ఎన్టీఆర్‌పై నోరుపారేసుకుని అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు.

అసలు టీడీపీ నేతలు ఏమన్నారంటే.. జూ.ఎన్టీఆర్ ఓ వీడియో ద్వారా అసెంబ్లీలో జరిగిన ఘటనను సున్నితంగా ఖండించాడు. అతడు తన వీడియోలో ఎక్కడా చంద్రబాబు, భువనేశ్వరి, వైసీపీ నేతల పేర్లను ప్రస్తావించలేదు. దీంతో జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఎన్టీఆర్ ఆది, సింహాద్రిలా రెచ్చిపోతాడు అనుకుంటే చాగంటి ప్రవచనాలు చెప్పాడంటూ వర్లరామయ్య, బుద్ధా వెంకన్న లాంటి నేతలు ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలకు గట్టి హెచ్చరికలు పంపకుండా ఎన్టీఆర్ తప్పు చేశాడని.. అసలు స్పందించకపోయినా బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.