చంచల్ గూడ జైలు నుంచి NSUI నేతలు విడుదల
చంచల్ గూడ జైలు నుంచి ఎన్ఎస్యూఐ నేతలు విడుదల అయ్యారు. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 18 మందికి నాంపల్లి కోర్డు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వారంతా సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్శిటీకి అనుమతించాలంటూ ఈనెల 1వ తేదీన ఎన్ఎస్యూఐ నేతలు వీసీ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
దీంతో వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి, పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఎస్యూఐ నేతలను కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మగళవారం బెయిల్ రావడంతో జైలు నుంచి వీరంతా విడుదలయ్యారు. జైలు నుంచి బయటకొచ్చిన బల్మూరి వెంకట్ కి ఎన్ఎస్యూఐ నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టినా, జైల్లో బంధించినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదన్నారు బల్మూరి వెంకట్.