రేపు హైదరాబాద్ లో సైక్లింగ్ ట్రాక్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ నగరంలో మరో మణిహారం చేరబోతున్నది. ఓఆర్ఆర్ పరిధిలో సోలార్ రూఫ్తో కూడిన 21 కి.మీ సైక్లింగ్ ట్రాక్కు రేపు మంగళవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఓఆర్ఆర్ వెంట నానక్రామ్గూడ-టీఎస్పీఏ, నార్సింగి-కొల్లూరు స్ట్రెచ్లో 4.5 మీటర్ల వెడల్పులో 3 లేన్ బై-సైకిల్ ట్రాక్కు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబదించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసారు. ఇది సీసీటీవీలతోసహా అన్ని భద్రతా ఫీచర్లతో 24/7 పని చేస్తుందని ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ తెలిపారు.
మరోపక్క కేటీఆర్ సైతం ట్విట్టర్ ద్వారా ఈ ప్రారంభోత్సవం ఫై ట్వీట్ చేసారు. హైదరాబాద్ లో సోలార్ రూఫ్ తో కూడిన సైక్లింగ్ ట్రాక్ ను అభివృద్ది చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇది నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు రేపు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్ ) పరిధిలో శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు. తొలి విడతగా 21 కి.మీ పరిధిలో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. వచ్చే ఏడాది వేసవికాలంలోగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేసి సైక్లింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.