గంటన్నరలోనే ఒమిక్రాన్‌ పరీక్ష ఫలితం..ఢిల్లీ ఐఐటీ సరికొత్త విధానాన్ని బయటపెట్టింది

ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు ఢిల్లీలోని ఐఐటీ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ను ఉపయోగిస్తున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్‌ ఆఫ్‌ బయలాజికల్‌ సైన్సెస్‌ రాపిడ్‌ స్క్రీనింగ్‌ పరీక్షను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పరీక్షకు పేటెంట్‌ తీసుకోవడం కోసం ఐఐటీ దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి కోసం పారిశ్రామిక భాగస్వాములతో చర్చలు ప్రారంభించింది.

ఐఐటీ పరిశోధక బృందం గంటన్నరలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించారు. ఆర్‌టీపీసీఆర్‌ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌లో వేరియంట్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. ఎస్‌జీన్‌లో ఉండే మ్యుటేషన్లు పరీక్షలో బయటపడితే ఒమిక్రాన్‌గా నిర్ధారిస్తారు. సింథటిక్‌ డీఎన్‌ఏ ముక్కలను ఇందులో వాడతారు. కొత్త విధానంతో తొందరగా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చన్నారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్‌ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది.