మారటోరియం గడువు పొడిగింపు సాధ్యం కాదు

6 నెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరుపై ప్రభావం.. సుప్రీంకు తెలిపిన కేంద్రం

supreme court
supreme court

న్యూఢిల్లీ: కరోనాతో ఏర్పడిన సంక్షోభం వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీపై వడ్డీ, మారటోరియం గడువు పొడిగింపు వంటి అంశాలపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు పలు విషయాలు తెలిపింది. రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని మరోసారి పొడిగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మారటోరియం 6 నెలలకు మించి ఇవ్వడం సాధ్యం కాదని ఆర్బీఐ దాఖలు చేసిన అవిడవిట్ లో పేర్కొంది. కరోనా వల్ల నష్టపోయిన ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమనాన్ని అందించలేమని తేల్చి చెప్పింది.

వడ్డీపై వడ్డీని వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా కేంద్ర సర్కారు స్పష్టతనిచ్చింది. నిర్దిష్ట రంగ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి న్యాయస్థానం వెళ్లకూడని కేంద్ర సర్కారు, ఆర్బీఐ తెలిపాయి. మారటోరియం వ్యవధి 6 నెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరుపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాయి. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడమే కాకుండా ఇతర ఊరట కల్పించినా భారత ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని కేంద్ర సర్కారు తెలిపింది. కరోనా వ్యాప్తికి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని పేర్కొంది. దీంతో ఆయా రంగాల ఇబ్బందులను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేసింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/