కొత్త హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా కొత్త తరహా హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. హాసంగ్-8గా ఆ మిస్సైల్ను పిలుస్తున్నారు. అయిదేళ్ల సైనిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అయిదు కొత్త ఆయుధాలను తయారు చేశామని, దాంట్లో ఈ మిస్సైల్ కూడా ఒకటని నార్త్ కొరియా తెలిపింది. ఇదొక వ్యూహాత్మక ఆయుధమని ఆ దేశం చెబుతోంది. ఉత్తర కొరియా ఇచ్చిన సంకేతాల ప్రకారం కొత్త హైపర్సోకిన్ మిస్సైల్కు అణ్వాయుధ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం నిర్వహించిన పరీక్షతో.. నార్త్ కొరియా వెపన్ టెక్నాలజీలో మరింత బలోపేతం అయినట్లు అర్థమవుతోంది. కొత్త ఆయుధంతో తమ ఆత్మరక్షణ సామర్థ్యం పెరిగినట్లు ఉత్తర కొరియా తెలిపింది. ఈ మధ్యనే క్రూయిజ్, బాలిస్టిక్ మిస్సైళ్లను ఆ దేశం పరీక్షించింది.
సాధారణ మిస్సైళ్ల కంటే హైపర్సోనిక్ క్షిపణులు చాలా వేగంగా వెళ్తాయి. దాని వల్ల అవి మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్కు కూడా దొరక్కుండా ఉంటాయి. కొత్త క్షిపణిలో నేవిగేషనల్ కంట్రోల్, స్టెబిలిటీ సాధించినట్లు ఉత్తర కొరియా పేర్కొన్నది. కొత్త తరహా ఇంధన వ్యవస్థతో ఆ మిస్సైల్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇదో కీలక మైలురాయి అని డిఫెన్స్ నిపుణులు అంటున్నారు. మిషన్ ఫ్యూయల్ ఆంపౌల్ ద్వారా.. మిస్సైల్ లాంచ్ ప్రిపరేషన్ సమయం తగ్గుతుంది. ఇక సాలిడ్ ఫ్యూయల్ మిస్సైల్ తరహాలో అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. హైపర్సోనిక్ గ్లైడింగ్ క్షిపణులను శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నట్లు ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ జనవరిలో తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/