ఉత్తర కొరియాలో కరోనా కలకలం..ఒక్కరోజే 2.7 లక్షల కేసులు

కరోనా కట్టడికి సైన్యాన్ని రంగంలోకి దించిన కిమ్ జాంగ్

ప్యాంగాంగ్‌: ఉత్తర కొరియాపై కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కరోనా దెబ్బకు ఆ దేశం అల్లాడుతోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 2.7 లక్షల మంది జ్వరం బారిన పడ్డారు. అయితే, కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆ దేశం వద్ద పరీక్షల కిట్లు లేకపోవడంతో… ఈ జ్వరం కేసులన్నింటినీ కరోనా కేసులుగానే భావిస్తున్నారు. మరోవైపు ఆరుగురు చనిపోవడం ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో పరిస్థితిని కట్టడి చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించారు. మిలిటరీ ఆధ్వర్యంలో మందుల పంపిణీ చేపట్టారు. ప్రజలపై కఠినమైన ఆంక్షలను విధించారు.

అలాగే, అధికారులపై కిమ్ జాంగ్ మండిపడ్డారు. జ్వరాల కేసులు అమాంతం పెరిగిపోతున్నా నియంత్రించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చేతకాని తనం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారిందని అన్నారు. సమయం జీవితంతో సమానమని… ఇకపై ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా వైరస్ కట్టడికి నడుం బిగించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఉత్తరకొరియాలో 17 లక్షలకు పైగా జనాలు జ్వరం బారిన పడ్డారు. నిన్న సాయంత్రం వరకు మొత్తం 62 మంది చనిపోయారు. మరోవైపు ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ… మందులు ఓవర్ డోస్ ఇవ్వడం, సరైన విధానంలో చికిత్స చేయకపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించాయని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/