మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
48 గంటల్లో రెండో బాలిస్టిక్ మిస్సైల్
సియోల్: ప్రపంచ దేశాల ఆందోళనలను, హెచ్చరికలను ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. వరుసగా మిస్సైల్స్ ప్రయోగాలను కొనసాగిస్తూ ఉద్రిక్తతలను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఉదయం ఉత్తరకొరియా మరో ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. గత 48 గంటల్లో ఆ దేశం మిస్సైల్ ప్రయోగం చేయడం ఇది రెండోసారి. తూర్పు సముద్రం దిశగా మిస్సైల్ ను ప్రయోగించిందని దక్షిణకొరియా తెలిపింది. బాలిస్టిక్ మిస్సైల్ ను నార్త్ కొరియా ప్రయోగించిందని జపాన్ ప్రధాని కార్యాలయం కూడా ట్వీట్ చేసింది. ఉత్తరకొరియా ప్రయోగించిన మిస్సైల్ 66 నిమిషాల పాటు ప్రయాణించి తమ ఎక్స్లూజివ్ ఎకనామిక్ జోన్ లో పడిపోయిందని జపాన్ తెలిపింది.
కాగా, కిమ్ జోంగ్ ఉన్ ఆదేశంతో హస్వాంగ్-15 ఖండాంతర క్షిపణిని ప్యాంగ్యాంగ్ విమానాశ్రయం నుంచి శనివారం మధ్యాహ్నం ప్రయోగించినట్టు అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. ఇది ప్యాంగ్యాంగ్ అణు సామర్థ్యాన్ని ప్రదర్శించిందని పేర్కొంది.