అర్థశాస్త్రంలో మిల్ గ్రామ్, విల్సన్ లకు నోబెల్‌

వేలం విధానాల్లో వినూత్న ఆవిష్కరణలు

Paul R. Milgrom, Robert B. Wilson win Nobel Prize 2020 in economics

స్టాక్‌హోం: ఈ సంవత్సరం అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పాల్ మిల్ గ్రామ్, రాబర్ట్ విల్సన్ లను వరించింది. వేలం వేసే విధానాల్లో మెరుగైన ప్రక్రియలను ప్రతిపాదించడమే కాకుండా, వేలం సిద్ధాంతాల పరంగా వినూత్న ఆవిష్కరణలు చేసిన వీరిద్దరిని నోబెల్ కమిటీ అందించే ప్రతిష్ఠాత్మక ‘స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్’ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆర్థికరంగంలో విశేషంగా కృషి చేసిన వారికి ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ ‘స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్’ అవార్డు ప్రదానం చేస్తారు. కాగా, మిల్ గ్రామ్, విల్సన్ రూపొందించిన ఆధునిక వేలం సిద్ధాంతాలతో వేలం పాటల ఆచరణ మరింత సాఫీగా సాగే అవకాశముందని నోబెల్ కమిటీ గుర్తించింది. సంప్రదాయ పద్ధతుల్లో విక్రయాలు సాగించేందుకు వీలుకాని రేడియో తరంగాలు వంటి సేవలను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించేందుకు వీరిద్దరూ రూపొందించిన నవ్య వేలం విధానాలు ఉపకరిస్తాయని నోబెల్ కమిటీ పేర్కొంది. పాల్ మిల్ గ్రామ్, రాబర్ట్ విల్సన్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/